Sunday, June 7, 2009

మృగశిర కార్తె

పరమాత్ముడు తాను సృజించిన జీవరాశుల బాగోగుల గురించే సదా కర్తవ్య నిమగ్నుడై ఉంటాడు. విశ్వగమన క్రియలకు పరమాత్ముడే అధినేత. నక్షత్రాలు, గ్రహాలు రాశులతో కూడిన విశ్వాంతరాళం ఆయన కనుసన్నల్లోనే పరిభ్రమిస్తూ జీవరాశులకు అనుకూలమైన రుతువులకు కారణమవుతోంది. చైత్రం నుంచి ఆషాఢం వరకు వేసవి, శ్రావణం నుంచి కార్తీకం వరకు వర్షకాలం, మార్గశిరం నుంచి ఫాల్గుణ మాసం వరకు శీతకాలం ఏర్పడుతూ ప్రపంచంలోని జీవులకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు పరమాత్ముడు కల్పిస్తూనే ఉన్నాడు.
తొలకరి జల్లులు వర్షకాల ప్రారంభానికి సూచనలు. అశ్వినితో ప్రారంభమై రేవతీ కార్తెతో ముగిసే కార్తులు మనకు ఇరవై ఏడు ఉన్నాయి. వర్షకాలం మృగశిర కార్తెతో ప్రారంభమవుతుంది. మృగశిర కార్తె పూనిననాడు ఆకాశంలో మృగం తలరూపంలో మూడు నక్షత్రాలు ఒక ఆకారంగా ఏర్పడటం కుతూహలం కలిగిస్తుంది. తొలకరితో ప్రారంభమయ్యే వర్షకాలంలో పొలం పనులు నిర్వహించుకోవడానికి అవసరమయ్యే పశు(మృగ) సంపదను సమాయత్తం చేసుకోవడానికి- ఆకాశంలో మృగశిరస్సు రూపంలో దైవం సంకేతాన్ని అందిస్తాడంటారు. కాలానికి అతీతుడైన పరమాత్మ మాస, తిథి, కార్తె, దిన నక్షత్ర గమనాలను నిర్దేశిస్తూ, జీవులకు అవసరమైన ఆహార ఉత్పత్తులకు, ఇతర దైనందిన వ్యాపకాలకూ మార్గదర్శకత్వం వహించడం వూహకందని అలౌకిక వ్యవహారమే!

వర్షకాలంలో ఎడతెరిపి లేని వానలవల్ల మనిషికి కొన్ని రుగ్మతలు కలిగే అవకాశం ఉంది. నేటికీ పల్లెప్రాంతాల్లో నాన్నమ్మలు, అమ్మమ్మలూ పిల్లలకు ఇంగువ బెల్లం కలిపి మృగశిర కార్తె పూనిన రోజు తినిపించడం ఆచారంగా కొన్ని ప్రాంతాల్లో గమనించవచ్చు. ఇంగువ శరీరంలో వేడిని అధికం చేసి వర్షకాలంలో సోకే జలుబు, ఇతర వ్యాధులను నియంత్రిస్తుంది. వర్షకాలంలో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మానవునిలో ఓజస్సు, తేజస్సు మృగశిరకార్తె అనంతరం అధికం అవుతాయని జీవకుడనే పూర్వకాలంనాటి వైద్యుడు గ్రంథస్థం చేశాడు.

పూర్వం వైశంపాయనుడు మృగశిర కార్తె రోజునే తన శిష్యుడైన యాజ్ఞవల్క్యునికి తైత్తిరీయోపనిషత్తు బోధించాడని అంటారు. ఈ ఉపనిషత్తు వర్షాధిపతి అయిన వరుణదేవుని ప్రార్థనతోనే ప్రారంభం అవుతుంది. అందుకే కార్తెలన్నింటిలోనూ మృగశిరకు చాలా ప్రాముఖ్యం ఉంది. అటు పరమాత్మకూ, ఇటు ధరణిపైని లౌకిక వ్యవహారాలకు మృగశిర కార్తె అనుసంధానంగా ఉంటుందన్నది పెద్దలమాట. తొలకరి జల్లుల కారణంగా భూమిపైనుంచి వచ్చే పరిమళం జీవరాశులన్నింటికీ ఆనందం కలిగిస్తుంది. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు వర్షపు జల్లుల అనంతరం ధరణినుంచి ఉద్భవించి వ్యాపించే పరిమళాన్ని తానేనని అంటాడు. మృగశిర కార్తె, ఆరుద్ర కార్తెల మధ్య వచ్చే యోగినీ ఏకాదశి, జగన్నాథ రథయాత్ర, కుమారషష్ఠి, వైవస్వత సప్తమి అత్యంత పర్వదినాలు. ఇంటిబయట వరుణదేవుడు వర్షపు జల్లులు కురిపిస్తూ చల్లని గాలులతో వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారిస్తే మనస్సు కూడా దైవధ్యానానికి ఆత్రుత పడుతుంది. అందుకే వర్షరుతు ప్రారంభాన్ని సూచించే మృగశిర కార్తె నగరవాసులకూ, పల్లెజనాలకూ పర్వదినమే.
- అప్పరుసు రమాకాంతరావు

ఏరువాక పున్నమి

సామాజిక స్వరూపాన్ని నిర్ణయించేది ఆ ప్రజలకు భగవంతునిపై ఉన్న దృక్పథం. ఆది మానవుడికి దేవుడు ప్రాకృతికశక్తి. వ్యవసాయ సంస్కృతి దాకా అదే సాగుతూ వచ్చింది. గణజీవితంలోని ప్రాకృతిక పూజలన్నీ ఆర్యుల చేతిలో సంస్కృతీకరణం చెందుతూ వచ్చాయి.
రైతులు తమకు ఆహారాన్ని ఇచ్చే పంట పొలంలోను, తమతో పాటు క్షేత్రంలో శ్రమించే పశువుల్లోను, వ్యవసాయ ఉపకరణాల్లోను దైవాన్ని సంభావించారు. ఆంధ్రదేశంలో జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమను కర్షకులు ఏరువాక పున్నమిగా జరుపుకోవడంలో ఈ దృష్టి గోచరిస్తుంది. సేద్యం భారతదేశంలో ప్రధాన జీవనాధారం. దేశ సౌభాగ్యంలో కర్షకులు జరుపుకొనే ఈ ఉత్సవం జనజీవనంలో ఏరువాక పున్నమి గా ప్రాచుర్యం వహించినా, ఇది వైదికోత్సవం కాదు. కొందరు పండితులు దీన్ని కృషి పౌర్ణమిగా పేర్కొన్నారు.

వర్షరుతువు ఆరంభంకాగానే కృషీవలురు క్షేత్రపాలుని సంబోధిస్తూ మంత్రాలు చదువుతుండేవారని రుగ్వేదం చెబుతుంది.

జైమిని న్యాయమాలలో ఉద్‌వృషభయజ్ఞం పేర్కొన్నారు. ఉత్తర భారతంలో ఆంధ్రుల ఏరువాక పండుగలా ఉద్‌వృషభయజ్ఞం చేసే సంప్రదాయం ఉండేదని, ఆ రోజు ఎడ్లను పూజించి పరుగెత్తించేవారని తెలుస్తోంది.

విష్ణుపురాణంలో సీతాయజ్ఞం ప్రస్తావన ఉంది. సీత అనే మాటకు నాగేటి చాలు అని అర్థం.

బ్రాహ్మణులకు మంత్రజపమే యజ్ఞం, కర్షకులు సీతాయజ్ఞం చేస్తారు, గోపాలురు గిరి యజ్ఞపరులు అని శ్రీకృష్ణుడు గోప వృద్ధునితో చెప్పినట్లు భాగవత పురాణం పేర్కొంటోంది. బౌద్ధ జాతక కథల్లోని వప్ప మంగలదివస ఏరువాక పండగను పోలినదే. శుద్ధోదన మహారాజు కపిలవస్తు నగరంలో వర్ష రుతువు ఆరంభం కాగానే కర్షకులకు లాంఛనంగా ఒక బంగారు నాగలిని అందజేసేవాడని లలితవిస్తరం చెబుతోంది. హాలుని గాథాసప్తశతిలో ఏరువాక పున్నమి ప్రస్తావన ఉంది. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని చెబుతారు. వర్షరుతువు ఆరంభం కాగానే జ్యేష్ఠ పూర్ణిమనాడు కర్షకులు ఉదయమే ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు గంటలతో అలంకరించి, ఎడ్లను కట్టేకాడిని ధూపదీప నైవేద్యాలతో పూజించడం పరిపాటి. ఎడ్లకు పొంగలి పెడతారు. సాయంకాలం గ్రామంలోని రైతులంతా మంగళవాద్యాలతో ఊరేగింపుగా పొలాలకు వెళ్లి దుక్కి ప్రారంభిస్తారు. ఊరి వాకిట గోగునారతో చేసిన తోరణం కడతారు. దాన్ని చెర్నాకోలలతో కొట్టి ఎవరికి దొరికిన పీచును వారు తీసుకుపోతారు. ఇది పశువులకు మేలు చేస్తుందని నమ్మకం. ఐరోపా దేశాల్లోని మేపోవ్ ఇటువంటి పండుగే.
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు