Wednesday, November 18, 2009

పవిత్ర మాసం మార్గశిరం

మూడు నక్షత్రాల సమాహారం మృగశిర. వాటికి ప్రత్యేకమైన పేర్లు లేవు. ఆ మూడింటినీ కలిపి ఇల్వలా నక్షత్రాలు అంటారు. లేడితల లాగ మూడు కోణాలతో ఉంటుందీ నక్షత్రం. అందుకే ఈ నక్షత్రానికీ పేరు. చంద్రుడు పున్నమినాడు మృగశిర నక్షత్రంతో కూడి ఉన్న మాసం కాబట్టి ఇది- మార్గశిర (శీర్ష) మాసం. తాను మాసాలలో మార్గశిరాన్ని అని గీతలో భగవానుడు స్వయంగా చెప్పాడు. అందువలన ఇదెంతో పవిత్రమైన మాసం.
వేదకాలంలో అయనాంశం (సంవత్సరారంభం) ఈ మాసంతోనే అయ్యేది. కనుకనే ఈ మాసానికి అగ్రహాయణిక అనేది పురాణనామం. ఇది హేమంత రుతువులో తొలిమాసం. చల్లదనం (చలి) ఈ మాసం ప్రత్యేకత. మార్గశిర మాసంలో చలి మంటల్లో పడినాపోదనే నానుడి ఉంది. అయినా మంచు కురుస్తూ ఏర్పడిన ఆ చల్లదనం అపరాలులాంటి పంటలకు ఎంతో మేలు చేస్తుందని చెబుతారు. పశు పక్ష్యాదులకు, ఇతర ప్రాణులకు మోదం కలిగించే కాలమిది. అందువలన వాటి నుంచి వచ్చే ఉత్పత్తులూ సమృద్ధిగా ఉంటాయి. ప్రాణులన్నీ దృఢతరంగా, బలవర్ధకంగా ఎదగడానికి తగిన పరిస్థితులు ఈ మాస వాతావరణంలో ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది.
ఈ మాసం లక్ష్మీనారాయణులిద్దరికీ ప్రీతికరమైనదే. విష్ణువు అనుగ్రహం కలగాలంటే ఈ మాసమంతా బ్రహ్మీ ముహూర్తకాలంలో మేల్కోవాలంటారు. తులసి మొక్క మొదలులో ఉన్న మట్టిని సేకరించి నారాయణ నామస్మరణ చేస్తూ ఒంటికి పట్టించుకోవాలి. ఆపైన శిరస్నానం చేయడం పుణ్యప్రదమని పురాణ వచనం. స్నానాంతరం తులసి దళాలతో విష్ణువును పూజించడం సకలైశ్వర్యకరమని ఎందరో నమ్ముతారు. తులసిలోని సుగుణాలు, ఔషధతత్వాలు శరీరానికి చేరాలనేది అంతర్గత ఆరోగ్య భావన.
ఈ మాసంలో అతి ముఖ్యమైనది లక్ష్మి (గురు)వారం నోము. ఈ మాసంలో వచ్చే అన్ని లక్ష్మివారాల్లోను లక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజిస్తారు. ముఖ్యంగా కొత్తగా పెళ్ళయి అత్తవారింటికి వచ్చిన కోడలి చేత తొలి ఏడాది పున్నమి ముందు వచ్చేవారం తప్పక ఈనోము చేయిస్తారు. ఆ దంపతులు, ఆ ఇల్లు అష్త్టెశ్వర్యాలతో తులతూగుతారని నమ్మకం. ముఖ్యంగా ఈ ఆచారం ప్రాచీన కళింగ ప్రాంతమైన దక్షిణ ఒరిస్సా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో నియమనిష్ఠలతో, భక్తిశ్రద్ధలతో చేస్తారు. అత్యవసరమైనాసరే ఈరోజు డబ్బును ఖర్చుచేయరు. ఈ నియమాన్ని చాలా కుటుంబాలు కచ్చితంగా పాటిస్తాయి. ఇలా చేస్తే లక్ష్మి అనుగ్రహించి తమను విడిచిపెట్టకుండా ఉంటుందని నమ్మకం.
శుక్లపక్ష పాడ్యమి నాడు గంగానదీ (కుదరకపోతే గంగను స్మరిస్తూ) స్నానం చేస్తారు. ఇలా చేస్తే కోటి సూర్యగ్రహణాల సమయంలో స్నానం చేసిన ఫలితంగా చెబుతారు. శుక్లపంచమి నాగపంచమిగా దక్షిణాది వారు నాగపూజ చేస్తారు. ఉత్తర భారతదేశంలో శ్రావణశుద్ధ, భాద్రపద బహుళ పంచమి రోజులు ఈ పేరుతో నాగపూజకు ఉద్దేశించినా దక్షిణాదిన ఈరోజున చేస్తారు.
శుక్లషష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి. తారకాసురుని సంహారం కోసం జన్మించాడు కుమారస్వామి. ఇతడు యోగసాధన చేసి సుబ్రహ్మణ్యతత్వాన్ని తెలుసుకున్నాడు (మూలాధారం నుంచి సహస్రారం వరకు సర్పరూపంలో వ్యాపించి ఉండే శక్తే సుబ్రహ్మణ్యతత్వం). అందువలన కుమారస్వామిని బ్రహ్మచారిగాను, సర్పరూపంగాను పూజించేది ఇది. ఈ పూజ వలన పిల్లలకు బుద్ధి వికసిస్తుందంటారు.
శుక్లపక్ష అష్టమి కాలభైరవాష్టమి. కాశీ నగరానికి క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. కాశీకి వెళ్ళినవారు ముందుగా ఇతడి దర్శనం చేసుకోవాలి. ఆ తరవాతే విశ్వేశ్వరుని దర్శనం. ఇది పరమశివుని నియమం. పరమశివుని కోసం ఎన్నో అగచాట్లు పడ్డ ఇతడిని జన్మదినంనాడు పూజిస్తే కాశీక్షేత్ర దర్శన పుణ్యం కలుగుతుందంటారు.
శుక్లపక్ష ఏకాదశి మోక్షదా ఏకాదశి. తల్లిదండ్రులు గతించిన కుమారులు ఈరోజున ఉపవాసం ఉండి విష్ణ్వాలయదర్శనం చేసుకుంటే, పితృదేవతలు విష్ణుసాయుజ్యం పొందుతారని చెబుతారు. మోహావృతమైన అర్జునునికి యథార్థాన్ని, ప్రపంచానికి తత్వోపదేశాన్ని చేసినది భగవద్గీత. ఈరోజే భగవానుడు అర్జునునికి గీతోపదేశం చేసిన రోజు. అందువల్ల గీతాజయంతిగా ప్రసిద్ధం.
బ్రహ్మ విష్ణు శివాత్మల తేజస్వరూపం దత్తాత్రేయుడి అవతారం. ఇతడు విశ్వగురువు. స్మరించడంతోనే భక్తుల్ని మోక్షమార్గంలో నడిపిస్తాడు. ఇతనికి స్మర్తుగామి అనిపేరు. ఈయన అవతారదినం ఈమాస పూర్ణిమ. ఈరోజున ఇతడిని పూజించిన వారికి విద్యాబుద్ధులు, ఆయురారోగ్యాలు కలుగుతాయని విశ్వసిస్తారు.
సౌరమాన గణన ప్రకారం సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించే రోజు ధనస్సంక్రమణం. అది ఈమాసంలోనే వస్తుంది. ఈరోజు నుంచి మకర సంక్రమణం వరకు సాగే మాసానికి 'ధనుర్మాసం' అనిపేరు. విష్ణ్వాలయాల్లో ధనుర్మాసానికీ ప్రత్యేకత ఉంది. విశేషమైన పూజలు, ఉత్సవాలు చేస్తారు. ఇవికాక విశ్వకర్మ జయంతి, బతుకమ్మ పండుగ ఈ మాసంలోనే వస్తాయి.
- అయ్యగారి శ్రీనివాసరావు

No comments:

Post a Comment